దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌ ఇటీవల నార్వేలో జరిగింది. నార్వేలోని స్టావెంజర్‌‌ ఒపేరా హౌస్‌లో జరిగిన స్క్రీనింగ్‌కు రాజమౌళి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నిర్మాత శోభు యార్లగడ్డ తదితరులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బాహుబలి చిత్ర బృందంపై రేణు దేశాయ్ ప్రశంసలు కురిపించారు. స్టావెంజర్‌‌ ఒపేరా హౌస్‌లో జరిగిన స్క్రీనింగ్‌కు రేణు దేశాయ్ కూడా హాజరయ్యారు. స్క్రీనింగ్ తర్వాత సోషల్ మీడియా వేదికగా బాహుబలి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన రేణు.. ఒక భారతీయ సినిమా అంతర్జాతీయంగా గుర్తుంపు తెచ్చుకోవడం చూస్తుంటే గర్వంగా ఉందని చెప్పారు. ‘‘మా లాంటి ప్రేక్షకుల కోసం మీరు ఇచ్చిన ఈ సినిమా ఎక్స్‌పీరియన్స్‌ను మాటల్లో చెప్పలేను. స్టావెంజర్‌‌లో సినిమా చూసేందుకు నన్ను, అకీరాను ఆహ్వానించినందుకు శోభు గారికి థ్యాంక్స్” అని పేర్కొన్నారు. ప్రేక్షకులు కొన్ని నిమిషాల పాటు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారని చెప్పారు. ఈ మేరకు ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు.