వచ్చే డిసెంబర్‌‌ లోపు ఎన్నికలు జరగాల్సి ఉండటంతో తెలంగాణలో అప్పుడే పొలిటికల్ హీట్ పెరిగింది. పార్టీల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది. అభ్యర్థుల ఎంపికలో ఆయా పార్టీలు తలమునకలయ్యాయి. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ సోమవారం తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కేసీఆర్ ఇప్పటికే లిస్టును సిద్ధం చేశారని, రేపు అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మందికి మరోసారి అవకాశం ఇవ్వబోతున్నట్లుగా నేతలు చెబుతున్నారు. శ్రావణ సోమవారం, పంచమి రోజు కావడంతో 105 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారని బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతోంది. టికెట్లు దక్కని సిట్టింగులకు, ఇతర ఆశావహులకు ఇప్పటికే బుజ్జగింపులు కూడా పూర్తి చేసినట్లు ప్రచారం సాగుతోంది. జాబితాలో చోటు దక్కని వారికి ఇతర పదవుల్లో అవకాశం కల్పిస్తామని చెప్పినట్లు సమాచారం. ఓ 10 మంది దాకా సిట్టింగ్‌లకు సీట్లు దక్కలేదని తెలుస్తోంది.