మొదటి నుంచి కూడా నవీన్ పోలిశెట్టి వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. కథ ఏదైనా అందులో కామెడీపాళ్లు తగ్గకుండా చూకుంటున్నాడు. కథల ఎంపిక విషయంలో ఆలస్యమైనా, కొత్తదనానికే ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు. అలా ఆయన చేసిన సినిమానే ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. అనుష్కతో కలిసి ఆయన నటించిన ఈ సినిమా, సెప్టెంబర్ 7వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ .. ‘జాతిరత్నాలు’ తరువాత చాలా గ్యాప్ తీసుకున్నానని అంతా అంటున్నారు. కానీ నిజానికి నేను కావాలని గ్యాప్ తీసుకోలేదు .. అది వచ్చిందంతే. కోవిడ్ .. ఆ తరువాత చోటుచేసుకున్న పరిస్థితుల కారణంగా కొంత ఆలస్యమైంది. ఆ సమయంలో నేను కథలు వింటూ గడిపేశాను” అని అన్నాడు. “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా .. ఇంతవరకూ నేను చేసిన సినిమాల్లో పెద్దది. నేను ఫస్టు టైమ్ అవుట్ డోర్ కి వెళ్లిన సినిమా ఇదే. ఇంతవరకూ భీమవరం .. సంగారెడ్డి అంటూ లోకల్ రోల్స్ చేశాను. ఈ సినిమా చేస్తూ మరో సినిమా చేయవచ్చుగదా అని అడుగుతున్నారు. కానీ ఒకసారి ఒక పాత్రను ఒప్పుకుంటే, ఆ సినిమా అయిపోయేంతవరకూ నేను ఆ పాత్రలో నుంచి బయటికి రాలేను. అందువల్లనే మరో సినిమా చేయను. సెప్టెంబర్ 7న విడుదలవుతున్న ఈ సినిమా మాత్రం, చాలా బాగా వచ్చింది” అంటూ చెప్పుకొచ్చాడు.