టీమిండియాపై మాజీ ఆల్‌రౌండర్‌‌ యువరాజ్‌ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టుకు మంచి కెప్టెన్ ఉంటే సరిపోదని, కీలక ఆటగాళ్లు కూడా ఉండాలని అన్నాడు. ‘‘రోహిత్ శర్మ మంచి కెప్టెన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఎన్నో ఏళ్లుగా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతడు ముంబై జట్టుకు ఐదు టైటిల్స్‌ను అందించాడు. గొప్ప లీడర్‌‌గా మారాడు. అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్‌ ఉన్నాయి. ఒత్తిడిలోనూ చాలా తెలివిగా వ్యవహరిస్తాడు” అని ప్రశంసలు కురిపించాడు.

‘‘అయితే ఐసీసీ టైటిల్ నెగ్గాలంటే మంచి కెప్టెన్ ఉంటే సరిపోదు. అత్యుత్తమ జట్టు కూడా ఉండాలి. అనుభవం ఉన్న ఆటగాళ్లు భాగం కావాలి. ఈ బాధ్యతను సెలెక్టర్లు తీసుకోవాలి” అని సూచించాడు. భారత్‌కు రెండు ప్రపంచకప్ టైటిళ్లు అందించిన ధోనీ కూడా అత్యుత్తమ కెప్టెన్‌ అని, కానీ అతడికి అనుభవం ఉన్న ఆటగాళ్ల సపోర్ట్ ఉండేదని చెప్పాడు. వచ్చే ప్రపంచకప్‌నకు సరైన జట్టుతో వెళ్లకుంటే టోర్నీలో విజేతగా నిలవడం కష్టమని అన్నారు.

ఇక అక్టోబర్‌‌ 5 నుంచి వరల్డ్‌కప్ మొదలు కానుంది. 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్లలో యువరాజ్ సింగ్ సభ్యుడు. తొలి టీ20 కప్ గెలుచుకోవడంలో యువీ కీలకపాత్ర పోషించాడు. 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. 2011 వన్డే కప్‌లోనూ కీలక మ్యాచ్‌లలో జట్టును విజయతీరాలకు చేర్చాడు.