ys sharmila revanth reddy

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తన బర్త్ డేను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేస్తూ రాహుల్ జన్మదిన వేడుకలను చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నేతలు, శ్రేణులు రాహుల్‌కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాహుల్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.ఈ క్రమంలో రాహుల్ గాంధీకి వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బర్త్ డే విషెస్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు రాహుల్‌కు విషెస్ చెబుతూ షర్మిల ట్వీట్ చేయగా.. ఇది వైరల్‌గా మారింది. వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారం గత కొద్దిరోజులుగా జరుగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యానని, త్వరలోనే అధికారిక ప్రకటన ఉండొచ్చని చెబుతున్నారు. ఈ ఊహాగానాల క్రమంలో రాహుల్‌కు షర్మిల విషెస్ చెప్పడం హాట్‌టాపిక్‌గా మారింది.షర్మిల ట్వీట్‌తో కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం ఖాయమైందని, అందుకు ఇది బలం చేకూరుస్తుందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు షర్మిలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ఫోన్‌లో చర్చలు జరిపారు. కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీని విలీనం చేయాలని కోరారు. దీనికి షర్మిల కూడా అంగీకరించినట్లు వార్తలొచ్చాయి. పొత్తుకు సంబంధించి ఇతర పార్టీల నుంచి ఫోన్లు వస్తున్న విషయాన్ని షర్మిల కూడా ధృవీకరించారు. చాలా పార్టీల నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయని, కానీ లిఫ్ట్ చేయడం లేదని గతంలో మీడియా సమావేశంలో షర్మిల బయటపెట్టారు.