ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో శుక్రవారం అరెస్ట్ అయి ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత తరపున ఆమె భర్త అనిల్ నేడు సుప్రీంకోర్టులో కంటెప్ట్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ నెల 19న కవిత కేసు విచారణకు రానుండగా అంతలోనే ఈడీ ఆమెను అరెస్ట్ చేసిందని, సుప్రీంకోర్టు గతంలో జారీచేసిన ఉత్తర్వులకు అది విరుద్ధమని అందులో పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరిగే అవకాశం ఉంది. తమ కస్టడీలో ఉన్న కవితను నిన్న విచారించిన ఈడీ అధికారులు నేడు కూడా విచారించనున్నారు. నిన్నటి విచారణను అధికారులు వీడియో రికార్డు చేశారు. అధికారులు అడిగిన ప్రశ్నల్లో కొన్నింటికి సమాధానం చెప్పిన కవిత.. మరికొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉండిపోయారని సమాచారం. విచారణ అనంతరం సోదరుడు కేటీఆర్, భర్త అనిల్, న్యాయవాది మోహిత్‌రావు తదితరులు కవితను కలిశారు.