ఢిల్లీ లిక్కర్ కేసు దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే .. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టై ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. అయితే ఆమె తాజాగా రౌస్ ఎవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి కావేరీ భవేజాకు సంచలన లేఖ రాశారు. స్వయంగా తన చేతిరాతతో ఒక నోట్‌బుక్‌లో రాసిన నాలుగు పేజీల లేఖను కవిత రాయగా… అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కవిత లేఖలో పేర్కొన్నారు . ఈ లిక్కర్ పాలసీతో ఆర్థికంగా తనకు ఎలాంటి లబ్ధి కూడా చేకూరలేదని కవిత చెప్పుకొచ్చారు. కేవలం స్టేట్‌‌మెంట్ల ఆధారంగానే తనను రెండున్నరేళ్లుగా వేధించి చివరకు అరెస్టు చేసి చివరకు తన కుమారుడి పరీక్షలకు కూడా తోడు లేకుండా చేశారని ఈడీపై దుమ్మెత్తిపోశా రు. దేశమంతా రెండున్నరేళ్లుగా ఈ కేసు దర్యాప్తు చూస్తోందని . ఈడీ, సీబీఐ దర్యాప్తు అంతులేని కథగానే ఉండిపోయిందని కవిత అన్నారు. చివరకు ఈ కేసు విచారణ మీడియాలో జరుగుతోందన్నారు. మహిళా పొలిటీషియన్‌గా ఈ మొత్తం దర్యాప్తులో తాను ఓ బాధితురాలినేనన్నారు. తన జీవితంలో ఈ సంఘటన ఓ మాయని మచ్చగా చెప్పుకొచ్చారు. చివరకు నా మొబైల్ నెంబర్ కూడా టీవీ ఛానెళ్లలో ప్రత్యక్షమై.. తన వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లిందని కవిత ఆరోపించారు. ఈడీ, సీబీఐ అధికారుల దర్యాప్తులో తాను పూర్తి స్థాయిలో సహకరించి తనకు తెలిసినవన్నీ వెల్లడించానని కవిత తెలిపారు. తన బ్యాంకు లావాదేవీలతో పాటు వ్యాపార వివరాలను కూడా అందించానని కవిత చెప్పుకొచ్చారు. అయినా తాను ఫోన్లు ధ్వంసం చేశానంటూ , ఆధారాలను మాయం చేశానంటూ.. పదేపదే తనను నిందిస్తున్నారని ఆరోపించారు.తన ఇంట్లో రెండు దర్యాప్తు సంస్థల అధికారులు తనిఖీలు చేశారని.. తనను పలుమార్లు ప్రశ్నించారని లేఖలో కవిత పేర్కొన్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా సైతం కేసు విచారణ సందర్భంగా “మనీ ట్రయల్ లేదు… అవినీతి జరిగినట్లు ఆధారాల్లేవ్… ఇది నిలిచే కేసు కాదు..” అన్నారని కవిత వ్యాఖ్యానించారు. ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడబోమంటూ సుప్రీం కోర్టులో చెప్పి.. మాట తప్పారన్నారు. సరిగ్గా లోక్‌సభ ఎన్నికలకు ముందు తనను మార్చి 15న అరెస్టు చేశారని కవిత మండిపడ్డారు. . ఈ కేసులో తన పాత్ర ఉన్నట్లయితే.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం ఎందుకు అరెస్టు చేయలేదని.. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ, సీబీఐ కేసుల్లో దాదాపు 95 శాతం దేశంలోని ప్రతిపక్ష పార్టీ నేతలపైనే ఉన్నాయని కవిత ఆరోపించారు. బీజేపీలో చేరిన వెంటనే వారిపైన నమోదైన కేసులు అర్ధంతరంగా ఆగిపోతున్నాయంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.