తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సెటైర్లు వేశారు. మద్యం అమ్మకాల్లో దేశంలోనే మొదటి స్థానాన్ని తెలంగాణ దక్కించుకుందని ఎద్దేవా చేశారు. వాడవాడలా మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు కళకళలాడుతున్నాయని విమర్శించారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో బీజేపీ నేత వడ్డేపల్లి రాజేశ్వరరావు చేపట్టిన ఇంటింటికీ బీజేపీ పాదయాత్ర 50 రోజులకు చేరిన నేపథ్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఈటల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నికల హామీలైన డబుల్‌ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రూపాయి ఖర్చు కూడా లేకుండా వైద్య సేవలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.