తనను కలవడానికి దేశాధినేతలే అపాయింట్ మెంట్ అడుగుతారని చెప్పుకునే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కు ప్రతికూల పరిస్థితి ఎదురైంది. కేఏ పాల్ ఇవాళ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్ ను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులకు ఆయనకు అనుమతి నిరాకరించారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు అంగీకరించలేదు. దాంతో క్యాంపు కార్యాలయానికి వెళ్లే రోడ్డు మెయిన్ గేటు వద్దే కేఏ పాల్ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాను సీఎం జగన్ ను కలిసేందుకు వచ్చానని చెప్పారు. ఎన్నికల్లో కలిసి పనిచేద్దామని చెప్పేందుకు వచ్చానని వెల్లడించారు. ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోసం ఇవాళంతా వేచి చూస్తానని కేఏ పాల్ స్పష్టం చేశారు. అపాయింట్ మెంట్ ఇస్తే దీవిస్తా… ఇవ్వకపోతే శపిస్తా అని హెచ్చరించారు.