భారతదేశ ప్రధానమంత్రిగా మూడవసారి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో 30 మంది కేబినెట్ మంత్రులు, ఐదుగురు స్వతంత్ర హోదాకలిగిన సహాయ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన వేలాది మంది అతిథులు హాజరయ్యారు. హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల అగ్రనేతలు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అఫీఫ్, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే ఈ వేడుకకు హాజరయ్యారు. మోదీ 3.0 కేబినెట్’ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఏడు పొరుగు దేశాల నేతలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన తొలి ప్రసంగంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘పొరుగు దేశాలకే తొలి ప్రాధాన్యత’ విధానాన్ని కొనసాగించనున్నామని మోదీ స్పష్టం చేశారు. ‘సాగర్ విజన్’కు కట్టుబడి, నిబద్ధతతో భారత్ పనిచేస్తుందని ప్రధాని పునరుద్ఘాటించారు. తన మూడో దఫా ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో శాంతి, అభివృద్ధి, సంక్షేమం కోసం భారత్ నిర్విరామంగా కృషి చేస్తుందని మోదీ తెలిపారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నప్పటికీ.. ఈ ప్రాంతంలోని దేశాలతో సన్నిహిత భాగస్వామ్యాలను కొనసాగిస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలో ప్రజల మధ్య సంబంధాలు, అనుసంధానానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా అంతర్జాతీయ వేదికపై ఈ ప్రాంత దేశాల గొంతును భారత్ వినిపించే దిశగా కృషి చేస్తుందని విదేశీ నేతలకు మోదీ వాగ్దానం చేశారు. ఈ మేరకు విదేశీ అతిథుల వద్ద ప్రధాని మోదీ వ్యాఖ్యానించారని భారత విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.చారిత్రాత్మకంగా మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీకి విదేశీ అతిథులు అభినందనలు తెలియజేయగా.. ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారని విదేశాంగశాఖ తెలిపింది