ఆంధ్రావాళ్లకు, మనకు జరిగే యుద్ధమే ఈ అసెంబ్లీ ఎన్నికలు అని మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం కొత్తపల్లి మండలం మల్కాపూర్, లక్ష్మీపూర్ గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఆంధ్రావాళ్లు… ఢిల్లీ పార్టీలతో కుమ్మక్కై తెలంగాణను మళ్లీ దోచుకునేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ఆంధ్రావాళ్లకు, మనకు జరిగే యుద్దమే ఈ ఎన్నిక అన్నారు. తాను చేసిన అభివృద్ధి పనులు చూసి ఓటేయాలని కోరారు.

కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్‌ను గెలిపిస్తే ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఒక్కరోజు కూడా గ్రామాల ముఖం చూడని వ్యక్తిని ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిపిస్తే చేసేదేమీ ఉండదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ దొంగలకు ఓటు వేసి పవిత్రమైన ఓటును వృథా చేసుకోవద్దన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతుల్లోనే సుభిక్షంగా ఉంటుందని, ఇతర పార్టీల చేతిలో మోసపోతే ఇబ్బందిపడక తప్పదన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు దొంగలు.. మోసగాళ్లు అన్నారు. వారి పట్ల తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.