తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మండిపడ్డారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, జైలులో ఆయనకు సరైన వైద్యం అందడంలేదని చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు బరువు తగ్గారని, ఆయన ఆరోగ్యరీత్యా పలు అదనపు సౌకర్యాలు కల్పించాలని వైద్యులు సూచించినా అధికారులు పట్టించుకోవడంలేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. జైళ్ల శాఖ అధికారుల వ్యాఖ్యలు ప్రభుత్వ తీరుకు అద్దం పడుతున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తప్పుబట్టిన జనసేనాని.. కోర్టులు జోక్యం చేసుకుని ప్రభుత్వానికి తగు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వైద్యులు పూర్తి నివేదిక ఇవ్వాలని చంద్రబాబు కుటుంబ సభ్యులు అడిగినా అధికారులు స్పందించడం లేదని విమర్శించారు.