తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 55 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ నుంచి బరిలోకి దిగుతుండగా ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన జూపల్లి కృష్ణారావు కూడా సొంత నియోజకవర్గం కొల్లపూర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ, కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇటీవల బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి హన్మంతరావు అనుకున్నట్టే కుమారుడికి టికెట్ ఇప్పించుకున్నారు. ఆయనకు మల్కాజిగిరి టికెట్ కేటాయించిన కాంగ్రెస్.. కుమారుడు మైనంపల్లి రోహిత్‌రావుకు మెదక్ స్థానాన్ని కేటాయించింది. ఆందోల్ (ఎస్సీ) నుంచి మాజీ మంత్రి దామోదర్ రాజనరసింహ, మంథని నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బరిలోకి దిగుతున్నారు. సీతక్క తన సొంత నియోజకవర్గమైన ములుగు నుంచి పోటీ పడుతున్నారు.