ఆంధ్రప్రదేశ్‌లో ఆడబిడ్డల అదృశ్యం గురించి మాట్లాడగానే హాహాకారాలు చేసిన పాలకపక్షం, మహిళా కమిషన్ రాష్ట్రంలో నమోదవుతున్న అత్యాచారాలు, హత్యలపై ఎందుకు మౌనంగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ‘ఆడబిడ్డలపై సాగుతున్న దురాగతాల గురించి స్పందించాల్సిన బాధ్యత లేదా?’ అంటూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీలో జరుగుతోన్న అత్యాచారాలు, హత్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైతే ముఖ్యమంత్రి లేదా హోం శాఖ లేదా మహిళా కమిషన్ స్పందించలేదని మండిపడ్డారు. అనుమానాస్పద మృతి అంటూ పోలీసులు ఈ కేసు తీవ్రతను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారని అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. బాలిక తల్లిదండ్రుల ఆవేదనను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. విజయనగరం జిల్లా లోతుగెడ్డలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం ఘటన కలిచివేసిందన్నారు. మైనర్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటే రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ, శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థమవుతోందన్నారు.