స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో అరెస్టై… రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, హిందూపురం MLA నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్‌ ములాఖత్‌ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో తాజా పరిణామాలు, పొత్తులు భవిష్యత్‌ కార్యాచరణ సహా పలు కీలక అంశాలపై చర్చించారు. కాగా ములాఖత్ అనంతరం బయటకు వచ్చి మాట్లాడిన పవన్.. పొత్తుపై సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని పవన్ స్పష్టత ఇచ్చారు. తమతో బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు పవన్ చెప్పారు. కాగా చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రహ్మణిని ప్రత్యేకంగా పరామర్శించారు పవన్. రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌ సాక్షిగా టీడీపీ, జనసేన పొత్తు పొడిచింది. జైలు బయట పవన్‌ కల్యాణ్‌ పొత్తును కన్ఫామ్‌ చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. తాము కలిసి వెళ్తేనే వైసీపీ దౌర్జన్యాలను ఎదుర్కోగలమని చెప్పారు. విడివిడిగా పోటీ చేస్తే ఎదుర్కోలేమని చెప్పుకొచ్చారు..వైసీపీని సమష్టిగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది.. తాము అధికారంలోకి వచ్చాక.. వైసీపీకి మద్దతిచ్చే ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని మండిపడ్డారు. ఇది వైసీపీ నేతలు, కార్యకర్తలు గుర్తు పెట్టుకోవాలన్నారు.. జగన్‌కు ఇంకా మిగిలింది 6 నెలలే అంటూ హెచ్చరించారు పవన్‌. జగన్‌ యుద్ధమే కావాలంటే… అందుకు తాము కూడా రెడీ అన్నారు. చంద్రబాబు భద్రత విషయాన్ని మోదీ, అమిత్‌షా దృష్టికి తీసుకెళ్తామన్నారు. చంద్రబాబుని కలిసి బయటకు వచ్చిన తరువాత లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరిని పరామర్శించారు పవన్‌ కల్యాణ్‌. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.