తొమ్మిది టీవీ , సోషల్ మీడియా చానెల్స్ కి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తమపై ఉద్దేశ్యపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నాయంటూ పలు టీవీ, సోషల్ మీడియా ఛానల్స్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. ఆయన గతంలోనూ పలు ఛానెల్స్‌కు లీగల్ నోటీసులు పంపించారు. కుట్రలో పూరితంగానే తమపై అసత్య ప్రచారం జరుగుతుందని , చట్టబద్ధంగా ఎదుర్కొంటామని కేటీఆర్ అన్నారు. మాకు సంబంధమే లేని అంశాల్లో తమ పేరు, ఫొటోలు పలు చానెల్స్ ప్రస్తావిస్తున్నాయన్నారు. ఆ మీడియా సంస్థ, యూట్యూబ్ ఛానెల్స్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటూ పరువునష్టం కేసులు వేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఈ మేరకు తొమ్మిది మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెల్స్‌తో పాటు నేరుగా యూట్యూబ్ సంస్థకు కూడా కేటీఆర్‌ నోటీసులు పంపించారు.కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న సంస్థలు భవిష్యత్తులోనూ నోటీసులతో పాటు, కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కేవలం తనని , తన కుటుంబాన్ని బద్నాం చేయటానికే అసత్య ప్రచారాలు ,కట్టుకథలు అల్లుతున్నారన్నారు. తనకు, తమ కుటుంబానికి నష్టం కలిగించాలన్నదే ఆ చానెల్స్ ఉద్దేశమన్నారు. ఈ విషయాన్నే కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. అసలు తమకు సంబంధం లేని పలు అంశాల్లో తమ పేరును, ఫొటోలను వాడుతూ హీనమైన తంబ్ నెయిల్స్ పెడుతూ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఛానల్స్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. కేవలం ఒక వ్యక్తినో , ఒక కుటుంబాన్నో ఇబ్బందులకు గురి చేస్తున్న వీరంతా చట్ట ప్రకారం శిక్ష ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా మాకు సంబంధంలేని అంశాలను అంటగడుతూ చేసిన వీడియోలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వాటిని వెంటనే తొలగించుకుంటే మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కేవలం కొందరు వ్యక్తులు నడిపే యూట్యూబ్ ఛానల్‌తో పాటు కొన్ని మీడియా సంస్థలు ప్రణాళికతో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.