ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలో శనివారం సాయంత్రం ముఖ్యమంత్రిని కలిశారు. అంతకుముందు మధ్యాహ్నం గవర్నర్ కోటాలో వారిద్దరిని ఎమ్మెల్సీలుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కోదండరాం తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.

ఉద్యమం సమయంలో జేఏసీ చైర్మన్‌గా రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకు వచ్చారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించింది. కానీ అర్హతలు లేవంటూ గవర్నర్ తిరస్కరించారు. దీంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరాం, అమీర్ అలీఖాన్‌ల పేర్లను పంపించింది. గవర్నర్ ఈ ఫైలుపై సంతకం చేశారు.