వైసీపీ ప్రభుత్వం గుండ్లకమ్మ ప్రాజెక్టు మెయింటెనెన్స్ ను గాలికొదిలేసిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. రాజశేఖరరెడ్డి రూ. 750 కోట్లతో ప్రాజెక్టును నిర్మిస్తే… ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం వైసీపీ ప్రభుత్వం ఏడాదికి కోటి రూపాయలు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. రూ, 10 కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు నిలబడుతుందని… లేకపోతే నిలబడే అవకాశం లేదని ఎస్ఈ గారు చెపుతున్నారని అన్నారు. ప్రాజెక్ట్ కట్టి కూడా వృథా అయిపోతుందని చెపుతున్నారని తెలిపారు. 

ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని… ప్రాజెక్టుకు చేయాల్సిన మరమ్మతులు వెంటనే చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. ప్రాజెక్టు గేటు నీటిలో తేలుతోందని… దీన్ని చూస్తే మీరే అవమానంతో తల దించుకోవాల్సి వస్తుందని చెప్పారు. వైసీపీ పనితీరు ఇదే అని ఆ గేటు సాక్ష్యం చెపుతోందని వ్యాఖ్యానించారు. గత టీడీపీ ప్రభుత్వం కూడా ఆ ప్రాజెక్టు కోసం ఏం చేసిందో చెప్పాలని అన్నారు. ఇదే సమయంలో ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబుపై ఆమె సెటైర్లు వేశారు. సంబంధిత మంత్రి సంక్రాంతి డ్యాన్సులు చేస్తాడే తప్ప… పని చేయడట అని ఎద్దేవా చేశారు.