ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ను కొనుగోలు చేయడం తెలిసిందే. ట్విట్టర్ ను పూర్తిగా హస్తగతం చేసుకున్నప్పటి నుంచి మస్క్ తనదైన శైలిలో మార్పులు చేర్పులకు ఉపక్రమించాడు. ట్విట్టర్ పేరును కాస్తా ‘ఎక్స్’ గా మార్చేశాడు. పిట్ట లోగోను తొలగించి ‘ఎక్స్’ అనే అక్షరాన్నే లోగోలో నింపేశాడు. అంతేకాదు, ట్వీట్, రీట్వీట్ అనే పదాలను కూడా తొలగించి పోస్ట్, రీపోస్ట్ అనే ఫీచర్లను తీసుకువచ్చాడు.  కేవలం యూఆర్ఎల్ (https://twitter.com/home)లో తప్ప ట్విట్టర్ అనే పేరే ఎక్కడా మిగల్లేదు. కొన్నాళ్లలో అది కూడా ‘ఎక్స్’ మయం కానుంది. మొత్తమ్మీద ట్విట్టర్ అనేది కొన్నాళ్లకు ఓ చరిత్రగా మిగిలిపోనుంది.  గతేడాది ట్విట్టర్ ను మస్క్ 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తొలుత భారీ మొత్తానికి కొనుగోలు ప్రతిపాదన చేసిన మస్క్ మధ్యలో కొన్నాళ్లు ఊగిసలాడినా, చివరికి ట్విట్టర్ ను సొంతం చేసుకున్నాడు.