వైఎస్సార్‌సీపీ పార్టీ కి కర్నూలు జిల్లాలో మరో షాక్ తగిలింది. వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కప్పట్రాళ్ల బొజమ్మ, ఆ పార్టీ నాయకుడు డి.రామచంద్ర నాయుడు దంపతులు హైదరాబాద్‌లో అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆలూరు నియోజకవర్గంలో ,కప్పట్రాళ్ల బొజ్జమ్మ, డి.రామచంద్ర నాయుడు బలమైన నాయకులుగా ఉన్నారు. ఈ సందర్బంగా తాము తిరిగి టీడీపీలోకి రావడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు టీడీపీలో సముచిత స్థానం ఇస్తామని చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారన్నారు . అంతేకాకుండా ఆలూరు టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ, టీడీపీ కర్నూలు పార్లమెంట్‌ అభ్యర్థి పంచలింగాల నాగరాజుల గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు. దివంగత నేత కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడి హత్య అనంతరం ఆయన రాజకీయ వారసురాలిగా బొజ్జమ్మ రాజకీయాల్లోకి వచ్చారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆస్పరి జడ్పీటీసీగా, ఆమె భర్త రామచంద్ర నాయుడు దేవనకొండ ఎంపీపీగా పని చేశారు. వాల్మీకి బోయ సామాజిక వర్గానికి చెందిన బొజ్జమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీ రాయలసీమ రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో గత ఏడాది జూన్‌19న టీడీపీని వీడిన వైసీపీలో చేరారు. ఈ క్రమంలో బొజ్జమ్మకు ఆలూరు అసెంబ్లీ టికెట్‌ ఇస్తానంటూ సీఎం జగన్‌ హామీ ఇచ్చారని అనుచరులు చెబుతుంటారు. అదేవిధంగా ఆమెకు గన్‌మెన్‌లను కూడా కేటాయించారు. అయితే ఆలూరు టికెట్‌ను చిప్పగిరి జడ్పీటీసీ విరూపాక్షికి కేటాయించారు. బీసీ మహిళకు వైఎస్సార్‌సీపీ చేసిన ద్రోహాన్ని జీర్ణించుకోలేకపోయారు బొజమ్మ వర్గీయులు. కర్నూలు పార్లమెంట్‌ స్థానానికి అవకాశం ఇస్తారని ఆశించినా, అదే సామాజిక వర్గానికి చెందిన కర్నూలు మేయర్‌ బీవై రామయ్యకు టికెట్‌ కేటాయించింది. అప్పటి నుంచి బొజ్జమ్మ దంపతులు వైఎస్సార్‌సీపీ దూరంగా ఉంటున్నారు. వారం రోజుల క్రితం జగన్‌ ఎమ్మిగనూరుకు వచ్చిన సందర్భంగా కూడా బొజ్జమ్మ హాజరు కాలేదు. అంతేకాదు ఆలూరు సమన్వయకర్త విరుపాక్షి స్వయంగా బొజ్జమ్మ ఇంటికి వెళ్లి నచ్చచెప్పినా వినలేదు . కప్పట్రాళ్ల కుటుంబం మళ్లీ టీడీపీలోకి రావడంతో ఆలూరు నియోజకవర్గంలో టీడీపీకి బలం పెరిగిందని చెబుతున్నారు. వైఎస్సార్‌ పార్టీలోకి వెళ్లిన కప్పట్రాళ్ల బొజ్జమ్మ తన కుటుంబం 10 నెలల వ్యవధిలోనే తిరిగి మళ్ళీ టీడీపీలో చేరడం విశేషం. ఇప్పటికే ఆలూరు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం కూడా టీడీపీలో చేరారు.. ఆయన అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.