స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. బెయిల్ ఇస్తూ పలు షరతులు కూడా విధించింది. అయితే, ఈ షరతులను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని, నిబంధనలు పెంచాలని ఏపీ సీఐడీ హైకోర్టును కోరింది. ఈ మేరకు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ పై హైకోర్టులో సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు.  చంద్రబాబు రాజకీయ ర్యాలీలు, ప్రసంగాలు చేయకూడదని మెమోలో తెలిపారు. చంద్రబాబు రాజకీయపరమైన కార్యక్రమాల్లో పాల్గొనకుండా, మీడియాతో మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో ఎలాంటి ప్రకటనలు చేయరాదన్న షరతు విధించాలని సీఐడీ అధికారులు మెమోలో పేర్కొన్నారు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్దొద్దని కూడా ఆదేశించాలని తెలిపారు. నాలుగు వారాల పాటు చంద్రబాబును వైద్య చికిత్సకే పరిమితం చేయాలని స్పష్టం చేశారు. ఇద్దరు డీఎస్పీలు చంద్రబాబుతోనే ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని సీఐడీ అధికారులు తమ మెమోలో కోరారు.