విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ స్వాధీనంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విస్మయం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనపై మండిపడ్డారు. విశాఖ పోర్టులో సీబీఐ 25,000 కిలోల డ్రగ్స్‌ని సీబీఐ స్వాధీనం చేసుకోవడం షాక్‌కు గురిచేసిందన్నారు. డ్రగ్స్ స్వాధీనంలో ఏపీ పోలీసులు, పోర్టు అధికారులు సహకరించకపోవడం చూస్తుంటే ఈ వ్యవహారంలో అధికార పక్షం హస్తం కనిపిస్తోందని ఆరోపించారు. ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్‌ రాష్ట్రంలోకి రావడంపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల కోసమే వైసీపీ అధిష్ఠానం డ్రగ్స్‌ను తెచ్చినట్లు తెలుస్తోందని అన్నారు. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ డ్రగ్స్‌ క్యాపిటల్‌గా మారిపోయిందని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర యువత భవిష్యత్తు తీవ్ర ప్రమాదంలో పడిందని, ఈ సమస్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.