రాష్ట్రంలో తిష్ఠవేసిన అవినీతిపరులను రాయలసీమ ప్రజలు పౌరుషంగా అడ్డుకోవాలని, వారి చేతిలో నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. రాయచోటి నియోజకవర్గంలో ‘నిజం గెలవాలి’ పర్యటన సందర్భంగా కార్యకర్తలకు ఈ మేరకు ఆమె దిశానిర్దేశం చేశారు.

చంద్రబాబు పాలనలో ‘సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్’గా పేరుపొందిన ఏపీ నేడు అప్పుల ఆంధ్రప్రదేశ్ అయ్యిందని అన్నారు. దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని వైసీపీ ప్రభుత్వం నిలబెట్టిందని మండిపడ్డారు.. గతంలో ఏపీలో ఉన్న పరిశ్రమలన్నీ పక్కనున్న రాష్ట్రాలకు తరలివెళ్లిపోయాయని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘యువతకు ఉద్యోగావకాశాలు లేక ఇబ్బందులుపడుతున్నారు. టీడీపీ పాలనలో ఏపీకి పెట్టుబడులు వస్తే నేడు ఆ కంపెనీలు ఏపీని వదిలిపారిపోతున్నాయి. రాష్ట్ర సచివాలయాన్ని సహా తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చి ఆ అప్పులను మన నెత్తిమీద వేస్తున్నారు. తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు, నాయకులను గత 5ఏళ్లుగా అనేక ఇబ్బందులకు గురిచేశారు. దేశంలోనే రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని మార్చారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు రాయలసీమ కార్యకర్తలు పౌరుషంగా బయటకు రావాలి’’ అని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు.