కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలోకి వచ్చాక మరోలా మాట్లాడుతూ ప్రజలను మోసం చేశారని తీవ్రంగా మండిపడ్డారు. ఈమేరకు సోమవారం బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమ ప్రభుత్వం అనుసరించిన విధానాలనే అనుసరిస్తోందని, తద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కరెక్టేనని చెప్పకనే చెబుతోందని అన్నారు. దీనికి ఎల్ఆర్ఎస్ ను ఉదాహరణగా పేర్కొన్నారు. గతంలో ఎల్ఆర్ఎస్ కట్టొద్దన్న నేతలే నేడు గడువు విధించి మరీ వసూలు చేయాలని నిర్ణయించారని ఆరోపించారు.

ఎల్ఆర్ఎస్ అన్యాయమని, ప్రజల రక్తం తాగడమేనని, వేల కోట్లు దోచుకోవడానికేనని ప్రతిపక్షంలో వున్నప్పుడు ఆరోపించిన భట్టి విక్రమార్క, సీతక్క, కోమటిరెడ్డి బ్రదర్స్.. ఇప్పుడు ఉపముఖ్యమంత్రి, మంత్రులుగా ఉన్నారని కేటీఆర్ చెప్పారు. కష్టపడి దాచుకున్న సొమ్ముతో ప్రజలు కొనుక్కున్న ప్లాట్ లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎన్నికల ముందు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆయనే ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందేనని చెబుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నపుడు భట్టి, సీతక్క, కోమటిరెడ్డి బ్రదర్స్ ఎల్ఆర్ఎస్ పై మాట్లాడిన వీడియోలను కేటీఆర్ మీడియాకు చూపించారు.