కొడుకు అధికార పార్టీ, కూతురేమో ప్రతిపక్షం.. ఇద్దరిలో ఎవరికి మద్దతు తెలపాలనే ప్రశ్న తల్లికి ఎదురైతే జవాబివ్వడం అంత తేలిక కాదు. తన తల్లికి ఇదే ప్రశ్న ఎదురైందని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఓ మీడియా సంస్థ ఇచ్చిన ఇంటర్వ్యూలో షర్మిల మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండగా తన తల్లి వైఎస్ విజయమ్మ అమెరికా ఎందుకు వెళ్లారనే ప్రశ్నకు జవాబిచ్చారు. తనకు, తన సోదరుడు జగన్ కు మధ్య రాజకీయంగా పోటీ అనివార్యం కావడంతో తన తల్లి విజయమ్మ ఎవరో ఒకరి వైపు ఉండడం కన్నా ఇద్దరికీ సమదూరం పాటించడం, ఏ ఒక్కరి వైపు స్టాండ్ తీసుకోకపోవడమే మేలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. అందుకే తన తల్లి విజయమ్మ దేశంలో ఉండకుండా అమెరికా వెళ్లిపోయిందని షర్మిల వివరించారు. ఇక ఆంధ్రప్రదేశ్ కు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ తో ఎలాంటి ఉపయోగం లేదని వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా హోదా హామీతో అధికారం దక్కించుకున్న వైఎస్ జగన్ ఎన్నికలయ్యాక ఆ విషయం మరిచిపోయారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అత్యవసరమని, ప్రజల కష్టాలను తొలగించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని షర్మిల చెప్పారు. రాష్ట్ర ప్రజల కోసం ఏదైనా చేయాలని రాహుల్ గాంధీ తపనపడుతున్నాడని, భారత్ జోడో యాత్రలో భాగంగా ఏపీలో పర్యటించినపుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రాధాన్యతా అంశంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్టు షర్మిల గుర్తుచేశారు.