పద్మశ్రీ అవార్డు గ్రహీత, తెలంగాణ జానపద కళాకారుడు దర్శనం మెుగిలయ్య అలియాస్ కిన్నెర మెుగలయ్య దీనస్థితిపై ఇటీవల సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి . కుటుంబాన్ని పోషించటం కోసం హైదరాబాద్ శివారు తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఓ నిర్మాణ స్థలంలో ఆయన కూలీగా మారినట్టు కథనాలు వచ్చాయి. . గత ప్రభుత్వం ఇచ్చిన కోటి రూపాయల గ్రాంట్ పిల్లల పెళ్లిల్లు ఇతర ఖర్చులకు అయిపోయాయని.. తుర్కయంజాల్‌లో చేపట్టిన ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆగోపోయిందని, ప్రభుత్వం ఇస్తానని చెప్పిన 600 గజాల ఇంటి స్థలం ఇంకా మంజూరు కాలేదని మొగులయ్య ఆవేదన వ్యక్తం చేశారు. .. కలెక్టరేట్ ఆఫీసులు చుట్టూ తిరిగినా అధికారులు మారుతున్నారనే తప్ప తన సమస్య తీరటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మెుగలయ్యపై వరుస కథనాలు సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో గత రెండ్రోజుల క్రితం సర్క్యూలేట్ కాగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. మెుగులయ్యను ఆదుకుంటానని ఆయన ట్వీట్ చేశారు. తాజాగా మెుగులయ్యకు ఆర్థికసాయం అందించి కేటీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఎమ్మెల్యేలు వివేకానంద్, చామకూర మల్లా రెడ్డి, మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి కేటీఆర్ మెుగులయ్యకు సాయం అందజేశారు. ఈ సందర్భంగా మెుగులయ్య తన బాధను కేటీఆర్‌కు చెప్పుకొన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆరే తనను గుర్తించారని.. తనకు ఇంటి జాగా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని, అయినా ఇప్పటి వరకు తనగు జాగా మంజూరు కాలేదని వాపోయారు. కలెక్టర్లు మారినా.. తనకు ఇచ్చిన హామీ నెరవేరలేదని చెప్పారు. చిన్నప్పటి నుంచి మట్టినే నమ్ముకొని బ్రతికానని.. కాకతీయ కాలువకు కూడా కూలీగా పని చేసినట్లు మొగులయ్య గుర్తు చేశారు. తనకు ఇంతటి గుర్తింపు కేసీఆర్ వచ్చిందని చెప్పారు. మెుగులయ్య విజ్ఞప్తికి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. కలెక్టర్‌తో మాట్లాడి ఇంటి స్థలం మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.