బీఆర్ఎస్ అంటే 24 గంటల ఉచిత విద్యుత్ అని, కాంగ్రెస్ అంటే రాత్రి పూట దొంగ కరెంట్ అని మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఉచిత విద్యుత్ ను కాంగ్రెస్ హయాంలో ఉత్త విద్యుత్ గా మార్చారని విమర్శించారు. వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ ఇస్తే చాలని రేవంత్ రెడ్డి చెప్పారని… ఆయనకు రైతులే బుద్ధి చెపుతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వడం లేదని విమర్శించారు. దేశంలో 24 గంటల సేపు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. సంగారెడ్డిలో బీసీ బంధు చెక్కులను, పంచాయతీ కార్యదర్శులకు రెగ్యులరైజేషన్ పత్రాలను ఈరోజు హరీశ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు.