‘సిగ్గుచేటు ఏమిటంటే, పరిపాలన నా చేతుల్లో లేదు… ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉందని నిన్న రేవంత్ రెడ్డి అన్నారు. మరి ముఖ్యమంత్రిగా నువ్వు ఎందుకు? పరిపాలన అల్టిమేట్‌గా సీఎం చేతుల్లోనే ఉంటుంది. తాత్కాలికంగా రెండు నెలల పాటు ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం సమన్వయం చేస్తుంది. అది కూడా రేవంత్ రెడ్డికి తెలియదు. పరిపాలన అనుభవం లేదు కదా’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పరిపాలన తన చేతుల్లో లేదనడం చాలా చిల్లరగా ఉందన్నారు.

వికారాబాద్‌లో నిర్వహించిన చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ… గతంలో ప్రభుత్వాన్ని ఎలా నడుపుతావని అడిగితే సీఎం పదవి గుంపు మేస్త్రీ పదవి అని చెప్పారని గుర్తు చేశారు. ఇక ప్రధానమంత్రేమో తాపీ మేస్త్రీ… ఇద్దరూ కలిసి తెలంగాణకు సమాధి కట్టే పనిలో ఉన్నారని విమర్శించారు. తెలంగాణ పార్టీకి సమాధి కట్టాలని ఇద్దరు కలిసి పని చేస్తున్నారని ఆరోపించారు.