కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ పార్టీ బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ.2500 ఇస్తామని హామీ ఇచ్చిందని… కానీ దానిని అమలు చేయడం లేదన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతోందని… అంటే ఒక్కో మహిళకు రూ.10,000 అధికార పార్టీ బాకీ పడిందన్నారు. క్వింటాల్ వడ్లు రూ.2500కి కొనుగోలు చేస్తేనే కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు ఉంటుందన్నారు. హామీలు అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీకి… లేదంటే బీఆర్ఎస్‌కు ఓటు వేయాలన్నారు. బీజేపీ పదేళ్ల కాలంలో అన్ని వర్గాలు దగాపడ్డాయని విమర్శించారు. జాతీయ పార్టీలు గెలిస్తే ఢిల్లీకి గులాంగిరి చేయాలన్నారు.