ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 7 వేల కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే వేదికను పంచుకున్నారు. గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు వేదికపై ఆసీనులయ్యారు. ఆదిలాబాద్ కు వచ్చిన మోదీకి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క స్వాగతం పలికారు. మోదీని రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించారు. 

సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ… ఎన్నికల సమయంలోనే తాము రాజకీయాలు చేస్తామని, మిగిలిన సమయమంతా రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖరితో ఉంటే… రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని అన్నారు. కేంద్రంతో తాము యుద్ధం చేయదలుచుకోలేదని చెప్పారు. ఒక పెద్దన్న మాదిరి ప్రధాని మోదీ రాష్ట్రానికి అన్ని విధాలా సహకరించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలని చెప్పారు.