తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మూడో పర్యాయం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 30న జరిగే పోలింగ్, డిసెంబరు 3న వచ్చే ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా ఎన్నికల బరిలో పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో, జీ న్యూస్-మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్ లో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.  తెలంగాణలో ఈసారి కూడా బీఆర్ఎస్ దే అధికార పీఠం అని పోల్ సర్వే పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా… అధికార బీఆర్ఎస్ కు 70 నుంచి 76 స్థానాలు లభిస్తాయని జీ న్యూస్-మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్ వెల్లడించింది.  అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి 27 నుంచి 33 స్థానాలు, ఎంఐఎంకు 6 నుంచి 7 స్థానాలు, బీజేపీకి 5 నుంచి 8 స్థానాలు లభించే అవకాశం ఉందని వివరించింది. ఇక, తెలంగాణ సీఎంగా ఎవరు ఉండాలన్న సర్వేలోనూ ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. కేసీఆర్ ను సీఎంగా 36 శాతం మంది కోరుకున్నారు.