ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ విశాఖలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాకు తన వేలిపై ఉన్న సిరా గుర్తును చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను ఓటు వేశానని, అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇంట్లో కూర్చోకుండా పోలింగ్ బూత్ లకు రావాలని అన్నారు. యువత, చదువుకున్న వాళ్లు పెద్ద సంఖ్యలో ఓట్లు వేస్తున్నారని… ఇది శుభ పరిణామని చెప్పారు. 

మార్పు రావాలంటే ప్రతి ఒక్కరూ ఇళ్ల నుంచి బయటకు రావాలని కేఏ పాల్ అన్నారు. మళ్లీ వాళ్లే గెలుస్తారులే అంటూ చాలా మంది విద్యావంతులు ఓటు వేసేందుకు ఇష్టపడరని… అది సరి కాదని చెప్పారు. మీకు నచ్చిన వారికి ఓటు వేయండి… క్రిమినల్స్ కు ఓటు వేయకండి అని సూచించారు. ఆలోచించి ఓటు వేయాలని చెప్పారు. మీరు ఓటు వేయడమే కాకుండా… మీకు తెలిసిన వారందరి చేత ఓటు వేయించాలని అన్నారు. విశాఖ నుంచి కేఏ పాల్ ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.