ఏపీ అధికార పక్షం వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీని వీడిన పలువురు నేతలు విపక్షాల్లో చేరడం తెలిసిందే. తాజాగా, కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆర్ధర్ ఇవాళ ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పిన షర్మిల పార్టీలోకి స్వాగతించారు. 

కాగా, ఈసారి ఎన్నికల్లో నందికొట్కూరు టికెట్ ను వైసీపీ దారా సుధీర్ కు కేటాయించింది. దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇటీవల నందికొట్కూరు మార్కెట్ కమిటీ పాలకవర్గం నియామకంలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కీలకపాత్ర పోషించారు. బైరెడ్డి ప్రతిపాదించిన వ్యక్తికే చైర్మన్ పదవి లభించింది. 

బైరెడ్డి వర్గానికి చెందినవారికి మార్కెట్ కమిటీ పాలకవర్గ పదవులు దక్కడంతో ఎమ్మెల్యే ఆర్థర్ మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి గండ్రెడ్డి ప్రతాపరెడ్డి పేరును ఆర్థర్ ప్రతిపాదించగా నిరాశే ఎదురైంది.