సీఎం కేసీఆర్ సర్కారు తెలంగాణలోని అర్చకులకు శుభవార్త చెప్పింది. అర్చకులకు ఇకపై రూ.10 వేల గౌరవ వేతనం చెల్లించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. ధూప దీప నైవేద్య పథకం కింద ఇప్పటివరకు తెలంగాణలో అర్చకుల గౌరవం వేతనం రూ.6 వేలుగా ఉంది. దీనిపై రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అర్చకుల వేతనం రూ.2,500 మాత్రమేనని, దాన్ని సీఎం కేసీఆర్ రూ.6 వేలకు పెంచారని వెల్లడించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడా వేతనాన్ని రూ.10 వేలకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 6,541 ఆలయాలు ధూప దీప నైవేద్య పథకం పరిధిలో ఉన్నాయని, క్రమంగా మరిన్ని ఆలయాలను ఈ పథకం పరిధిలోకి తీసుకువస్తామని మంత్రి తెలిపారు.