ధరణిని రద్దు చేస్తే రైతుబంధు రాదని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అలంపూర్‌లో కాంగ్రెస్ ప్రజా గర్జన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రూ.100 కోట్లతో జోగులాంబ ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని కేసీఆర్ గతంలో చెప్పారని, కానీ ఈ రోజు ఆ గుడి పరిస్థితి ఎలా ఉందో అందరూ అర్థం చేసుకోవాలన్నారు. తమ పార్టీ అభ్యర్థి సంపత్ కుమార్ ఇక్కడి నుంచి గెలవాలని అమ్మవారిని దర్శించుకొని వచ్చానన్నారు. తామేదో 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని కేసీఆర్ చెబుతున్నారని, కానీ ఉచిత విద్యుత్ ఆలోచన చేసిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఇరవై నాలుగు గంటల విద్యుత్ వస్తుందా? సబ్ స్టేషన్‌లకు వెళ్ళి చూద్దామా? అని సవాల్ చేశారు. 24 గంటల ఉచిత విద్యుత్ కాంగ్రెస్ ఇస్తుందన్నారు. ఇప్పుడు 24 గంటల విద్యుత్ వస్తోందని నిరూపిస్తే తాను నామినేషన్ కూడా వేయనని సవాల్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతిని చేస్తే వెంకట్రామిరెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంకట్రామిరెడ్డి తనకు మిత్రుడని, అందుకే పాత మిత్రత్వం ఉంది కాబట్టి అడుగుతున్నానని… దొర వద్ద జీతానికి కుదిరావా? అని ప్రశ్నించారు. ఆయన చేస్తే రాజకీయాలు చేస్తాడు లేదంటే ఇంట్లో కూర్చుంటాడని భావించామని, కానీ దొర వద్ద జీతానికి కుదురుతావా? అని మండిపడ్డారు. కేసీఆర్ ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చలేదన్నారు. బోయల్ని ఎస్టీల్లో చేరుస్తామని మోసం చేశారన్నారు. ఆ వర్గానికి ఎమ్మెల్సీ ఇచ్చే బాధ్యత తనది అన్నారు. ఇక్కడ ఆర్డీఎస్ సమస్యను పరిష్కరించే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు.