భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సొంత కారు కూడా లేదట.. అంతేకాదు ఆయన మొత్తం ఆస్థి విలువ 20 కోట్లేనట. ఇక ఆయన పేరు మీద రెసిడెన్షియల్ ఫ్లాట్ కూడా లేదట. వివరాల్లోకి వెళ్తే… వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నుంచి పోటీచేస్తున్నరాహుల్ గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ఈ మేరకు పేర్కొన్నారు. అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం రాహుల్ వద్ద 55 వేల నగదు, 26.25 లక్షల బ్యాంకు డిపాజిట్లు, 4.33 కోట్ల బాండ్లు, షేర్లు, 3.81 కోట్ల మ్యూచువల్ ఫండ్స్, 15.21 లక్షల గోల్డ్ బాండ్లు, 4. 20 లక్షల విలువైన నగలు సహా రూ. 9.24 కోట్ల చరాస్తులు ఉన్నాయి.. రాహుల్ 11.15 కోట్ల స్థిరస్తులు కలిగి ఉన్నారు. సోదరి ప్రియాంకగాంధీతో పాటు రాహుల్ గాంధీకి ఢిల్లీలోని మెహరౌలి ప్రాంతంలో వ్యవసాయ భూమి ఉంది. ఇక గురుగ్రామ్‌లో కోట్లకుపైగా విలువైన ఆఫీస్ స్పేస్ ఉంది. అయితే తనకు వ్యవసాయ భూమి వారసత్వంగా వచ్చినట్టు రాహుల్ గాంధీ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అత్యాచార బాధిత కుటుంబ వివరాలను సోషల్ మీడియాలో బయటపెట్టినందుకు రాహుల్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. దీంతోపాటు బీజేపీ నేతల ఫిర్యాదుపై పరువునష్టం కేసులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు సంబంధించి నేరపూరిత కుట్ర కేసు కూడా తనపై నమోదైనట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ వయనాడ్ నుంచి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో రాహుల్ కు ప్రత్యర్థులుగా సీపీఐ నేత అన్నీ రాజా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే. సుందరన్ బరిలో ఉన్నారు. కేరళలో ఈ నెల 26న ఎన్నికలు జరగనున్నాయి.