Home Crime రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 280

రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 280

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు 280 మంది మరణించినట్టు అధికారులు అంచనాకు వచ్చారు. 900 మంది గాయపడ్డారు. యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు పక్కకు ఒరిగి, బోల్తా పడిపోయి ఉండగా, వాటిల్లో ప్రయాణికులు చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సహాయక చర్యల్లోకి భారత సైన్యం కూడా దిగింది. రైలు బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసే చర్యలు కొనసాగుతున్నాయి. 

డాగ్ స్క్వాడ్ సాయం కూడా తీసుకుంటున్నారు. మనుషుల జాడను శునకాల సాయంతో తెలుసుకుని, ఆయా చోట్ల చిక్కుకున్న వారిని రక్షించే చర్యలు కొనసాగుతున్నాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కు సైనికులు సాయం అందిస్తున్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డీజీ కర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. నలిగిపోయిన బోగీలను కట్ చేసి, లోపలున్న వారికి ఏమీ కాకుండా కాపాడడం పెద్ద సవాలుగా పేర్కొన్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ రైలు ప్రమాదంపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఈ రోజు నిర్వహించనున్నారు.