దేశంలో ఢిల్లీ లిక్కర్ స్కాం ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే .. ఈ కేసులో ముఖ్యమంత్రి స్థాయి నుండి నేతల వరకు సంబంధం ఉన్న ఎవ్వరినైనా అరెస్ట్ చేయటానికి ఈడీ సిద్ధంగా ఉంది. ఇక ఈ కేసులో అరెస్టై నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తీవ్ర నిరాశ ఎదురయింది. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఆమె బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. కవిత చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున … తనకు బెయిల్ మంజూరు చేయాలని కవిత కోర్టును కోరుతూ బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ వేశారు . అయితే, కవిత బెయిల్ పై బయటకు వెళ్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. ఇప్పటికే కొందరిని కవిత బెదిరించిందని కోర్టుకు తెలిపింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు… కవిత బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. మార్చి 15వ తేదీన లిక్కర్ కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే . మొదట ఈడీ కస్టడీలో ఉన్న కవితకు కోర్టు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలో, మార్చి 26వ తేదీ నుంచి ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు. మంగళవారంతో ఆమె జ్యుడీషియల్ రిమాండ్ ముగియబోతోంది. ఆమె జ్యుడీషియల్ రిమాండ్ ను కోర్టు పొడిగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.