కార్యకర్తలే టీడీపీకి బలమని, నాయకులు పార్టీ మారినా అండగా నిలిచేది కార్యకర్తలేనని నారా లోకేశ్ అన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలకు బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ కావాలేమో కానీ… టీడీపీ కార్యకర్తలు మాత్రం తమ అధినేత ‘రా.. కదలిరా’ అంటే వచ్చేస్తారని చెప్పారు. కార్యకర్తల కోసం 2014లో సంక్షేమ నిధిని ఏర్పాటు చేశామని… ప్రమాదంలో చనిపోయిన ప్రతి కార్యకర్త కుటుంబానికి రూ. 2 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటి వరకు రూ. 100 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. తనకు అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు లేరని… కానీ, దివంగత ఎన్టీఆర్ తనకు 60 లక్షల మంది అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములను ఇచ్చారని అన్నారు. పలువురు కార్యకర్తల పిల్లలను తన తల్లి నారా భువనేశ్వరి దత్తత తీసుకుని చదివిస్తున్నారని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలు, కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు పెట్టారని లోకేశ్ మండిపడ్డారు. తనపై కూడా 22 కేసులు పెట్టారని విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదే లేదని జగన్ కు ఆనాడే చెప్పానని అన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తున్న అధికారులు, వైసీపీ నేతల పేర్లను రెడ్ బుక్ లో ఎక్కిస్తున్నానని చెప్పారు. తాము మాయమాటలు చెప్పి అధికారంలోకి రాలేదని, ప్రజాధనాన్ని లూటీ చేయలేదని అన్నారు.