రాష్ట్రంలో ఫోన్ ట్యంపింగ్ ఎంత సంచలనం సృష్టిస్తుందో తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్పందించారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్‌తో మాకేం సంబంధం అంటున్నారని బీఆర్ఎస్ నేతలపై భట్టివిక్రమార్క మండిపడ్డారు. పదేళ్లు పాలించిన్నప్పుడు కచ్చితంగా ఈ వ్యవహారంలో వారికి బాధ్యత ఉంటుందన్నారు. దేశ భద్రత కోసమో , ఉగ్రవాదులను పట్టుకోవడం కోసమో ఫోన్ ట్యాపింగ్ చేస్తారు కానీ కానీ ప్రతిపక్ష నేతలను భంగం కలిగించేందుకు ఫోన్ ట్యాపింగ్ చేస్తారా? అంటూ ధ్వజమెత్తారు. ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు. భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు? వ్యాపారులు ఏం మాట్లాడుకుంటున్నారు? అధికారులు ఏం మాట్లాడుకుంటున్నారు? జడ్జిలు ఏం మాట్లాడుకుంటున్నారు? ఇలా అందరి జీవితాల్లోకి… వంటగదుల్లోకి… బెడ్రూంలలోకి వెళ్లి చూస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ పౌరుల భద్రతకు పెను ప్రమాదమన్నారు. బీఆర్ఎస్ నేతలు వారి రాజకీయ, వ్యక్తిగత అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత సమాచారం ఎలా వచ్చిందో విచారణలో తేలుతుందన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారన్నారు.