కేసీఆర్‌ను మూడోసారి గెలిపిస్తే తాము కచ్చితంగా జాబ్ క్యాలెండర్‌ను అమలు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వమంటున్న కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. కొంతమంది పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయిన కర్ణాటక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి రాకుండా చేయాలన్నారు. కేసీఆర్ ఇచ్చే ఇరవై నాలుగు గంటల విద్యుత్ కావాలా? రేవంత్ రెడ్డి చెప్పిన మూడు గంటల విద్యుత్ కావాలా? అని ప్రశ్నించారు.బీఆర్ఎస్‌ను తెలంగాణ ప్రజలు తమ ఇంటి పార్టీగా భావిస్తున్నారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ వస్తున్నామన్నారు. విద్యుత్, నీళ్లు… ఇలా ఒక్కో అంశాన్ని పరిష్కరిస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పచ్చగా మారిందన్నారు. రైతు బంధు కింద రైతుల ఖాతాల్లో రూ.73వేల కోట్లు జమ చేశామన్నారు. తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇస్తామని చెప్పారు. కేసీఆర్ భరోసా కింద పదిహేను కార్యక్రమాలు కొత్తగా చేపడతామన్నారు.