ఆదివారం హిందూపురం నియోజకవర్గంలోని జేవీఎస్ ప్యాలెస్‌లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి కార్యాచరణ, విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ త్వరలో జరిగే ఎన్నికలు మహాసంగ్రామం లాంటివని వ్యాఖ్యానించారు. . కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు కష్టపడి అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ వైసీపీపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి వ్యవస్థలను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న రాయలసీమలో రక్తం పారించారని, మద్య నిషేధం అమలు చేయకుండా కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని బాలకృష్ణ మండిపడ్డారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పదేళ్లు వెనక్కు వెళ్లిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ రాష్ట్రాన్ని సమర్ధవంతమైన పాలనతో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలంటే అది చంద్రబాబునాయుడికే సాధ్యమని అన్నారు. హిందూపురం అసెంబ్లీ స్థానానికి మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తాను హ్యాట్రిక్ సాధిస్తానని అన్నారు. నా అక్కాచెల్లెళ్లు అంటూ సొంత చెల్లెళ్లకే అన్యాయం చేశాడని బాలకృష్ణ అన్నారు.