తుక్కుగూడ ‘జన జాతర’ బహిరంగ సభలో ఏఐసీసీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోను విడుదల చేశారు. ‘న్యాయపత్రం’ పేరుతో విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో ఐదు గ్యారెంటీలు ఇచ్చారు. ఐదు న్యాయసూత్రాల్లో… యువతకు శిక్షణ, మహిళల కోసం నారీ న్యాయ్, రైతుల కోసం కిసాన్ న్యాయ్, కార్మిక్ న్యాయ్, తొంబై శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సమన్యాయం అందిస్తామన్నారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రానికి సంబంధించిన గ్యారెంటీల మేనిఫెస్టోను విడుదల చేశామని, ఇప్పుడు జాతీయ మేనిఫెస్టోను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. కొన్ని రోజుల క్రితం ఇక్కడి నుంచే ఆరు గ్యారెంటీలు ఇచ్చి… వాటిని అమలు చేస్తున్నామన్నారు. ఎన్నికలకు ముందు ఏ గ్యారెంటీని లేదా ఏ హామీని అయితే ఇచ్చామో… ఆ మాట నిలబెట్టుకున్నట్లుగా తెలంగాణ ప్రజలందరికీ తెలుసునన్నారు. తెలంగాణలో హామీలను నెరవేర్చినట్లు, జాతీయస్థాయిలో కూడా నిలబెట్టుకుంటామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ హామీలు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ మేనిఫెస్టో కాంగ్రెస్ గొంతు అనుకోవద్దని… ఇది యావత్ భారత దేశం యొక్క గొంతు అన్నారు. మేనిఫెస్టోలోను ఐదు న్యాయసూత్రాలు ఐదు భారతీయ ఆత్మలు అన్నారు.