గత రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత చాలా పెరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నాయకులకు కాకుండా, పార్టీకి ప్రాధాన్యత పెరిగిందని చెప్పారు. తాను పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఎంతో మంది జాతీయ నేతలు తెలంగాణకు వస్తున్నారని చెప్పారు. గతంలో కాంగ్రెస్ నేతలు వేరే పార్టీల్లోకి వెళ్లే వారని, ఇప్పుడు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వస్తున్నారని అన్నారు. 

వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కమ్యూనిస్టులు గాంధీభవన్ కు వచ్చి చర్చలు జరిపేవారని… ఇప్పుడు తన హయాంలో మళ్లీ వస్తున్నారని చెప్పారు. వేరే రాష్ట్రల్లో ఎన్నికలు ఉన్నప్పటికీ అక్కడ సీడబ్ల్యూసీ సమావేశాలను పెట్టకుండా తెలంగాణకు అవకాశం ఇచ్చారని… రాష్ట్రానికి జాతీయ నాయకత్వం ఎంతటి ప్రాధాన్యతను ఇస్తోందో దీని వల్ల అర్థం చేసుకోవచ్చని తెలిపారు. రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించినన్ని సభలను అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా నిర్వహించలేదని చెప్పారు.