టాలీవుడ్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ జనసేన పార్టీలో చేరారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ (SVCC) ద్వారా తెలుగు చిత్ర సీమలో అనేక విజయవంతమైన సినిమాలను అందించిన నిర్మాత భోగవల్లి వెంకట సత్యనారాయణ ప్రసాద్ (బీవీఎస్ఎన్ ప్రసాద్) సోమవారం జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ప్రసాద్ ధర్మ పరిరక్షణ నిమిత్తం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న యాగ క్రతువులో పాలు పంచుకున్నారు.యాగశాలలో ప్రతిష్ఠించిన దేవతామూర్తులకు నమస్కరించుకున్న అనంతరం కార్యాలయంలోనే ఉన్న పవన్ కళ్యాణ్ తో కాసేపు ముచ్చటించారు. పార్టీలో చేరాలనే తన నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ ఎదుట వ్యక్తపరిచారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతించిన జనసేనాని పవన్ ఆయనకు పార్టీ కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.