బీసీ ముఖ్యమంత్రి కావాలంటే బీజేపీని గెలిపించాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా జిన్నారంలో సింహగర్జన బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సుస్థిర ప్రభుత్వం కోసం బీజేపీని గెలిపించాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీజేపీ హవా ఉందన్నారు. బీఆర్ఎస్ గెలవదని, ఒకవేళ ఆ ప్రభుత్వం వచ్చినా ఎక్కువ రోజులు ఉండదని బాంబు పేల్చారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యులే ప్రభుత్వాన్ని కూలగొడతారన్నారు. మళ్లీ ఎన్నికలు వస్తాయన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి పదవి కోసం ప్రభుత్వాన్ని పడగొడతారన్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకోవడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజల్లో ఉండే వ్యక్తులకు టిక్కెట్ ఇవ్వాలి.. కానీ దోస్తులకు టిక్కెట్ ఇస్తారా? అని ప్రశ్నించారు. ఖానాపూర్‌లో జాన్సన్ గెలిస్తే ఆయనను కలవడానికి అందరూ పాస్ పోర్టులు తీసుకోవాలన్నారు.