కాళేశ్వరం ప్రాజెక్టుపై విపక్షాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రాజెక్టులన్నాక చిన్నచిన్న లోపాలు ఉండటం సహజమని అన్నారు. కాళేశ్వరం అంటే కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదని… అందులో 3 బ్యారేజీలు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీరు అందుతోందని తెలిపారు. ప్రజలపై ఒక్క రూపాయి అదనపు భారం పడకుండా… లక్ష్మీ బ్యారేజ్ మరమ్మతు పనులు పూర్తి చేస్తామని చెప్పారు. 
కాంగ్రెస్ పార్టీ వస్తే ధరణి తీసేస్తారని… మళ్లీ దళారీ వ్యవస్థను తీసుకొస్తారని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో కేజీ టు పీజీ విద్యను అందిస్తామని చెప్పారు. జీఎస్డీపీ అత్యంత వేగంగా పెరుగుతున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ తొలి స్థానంలో ఉందని చెప్పారు. తాగునీటి కోసం మిషన్ భగీరథకు రూ. 37 వేల కోట్లను ఖర్చు చేశామని… నీటి ప్రాజెక్టుల కోసం రూ. 1.70 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.