ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.

ఈ క్రమంలో విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీగా నగదును సీజ్ చేశారు. ఓ కారులో నగదు తీసుకువెళుతుండగా అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ నగదు సుమారు కోటి 50 లక్షలు ఉన్నట్లు సమాచారం.

ఫ్లైయింగ్ స్క్వాడ్ ఇంఛార్జ్ గోవింద్ ప్రమణ్ కుమార్, జి.సుబ్బారెడ్డి స్టాటిక్ సర్వియలెన్స్ టీం, గవర్నర్ పేట సీఐ, ఎస్సై సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో 26.33 లక్షల నగదు, 2.6 కేజీలు బంగారం, నగదు బంగారం కలిపి 1.6 కోట్లుగా గుర్తించారు. ఎన్టీఆర్ కాంప్లెక్స్ పార్కింగ్ వద్ద పట్టుకున్నారు. కాగా అంత డబ్బుకు సరైన ఆధారాలు చూపించలేకపోవడంతో సీజ్ చేశారు. అనంతరం ఐటీ డిపార్ట్మెంట్, జీఎస్టీకి పరిశీలన కోసం సమాచారం అందించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

గాదె రవీంద్రబాబు అనే వ్యక్తి కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఏపీలో త్వరలో జరుగనున్న ఎన్నికల కోసం డబ్బులు చేతులు మారకుండా ఉండేందుకు పకడ్బందీగా గస్తీ కాస్తున్నారు. అటు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ అక్రమ నగదు సరఫరాను అధికారులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు, ఫ్లైయింగ్ స్క్వాడ్‌లతో అధిక మొత్తంలో తరలిస్తున్న డబ్బును, మద్యం, ఇతర విలువైన వస్తువులను పట్టుకుంటున్నారు. సరైన పత్రాలు లేని వాటిని సీజ్ చేస్తున్నారు..