స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించింది. వాదనలు విన్న పిమ్మట ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. 

ఇటీవల చంద్రబాబుకు అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ ఇవ్వగా, ఆ బెయిల్ గడువు నాలుగు వారాలుగా న్యాయస్థానం పేర్కొంది. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో, చంద్రబాబు ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లనక్కర్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మధ్యంతర బెయిల్ సమయంలో విధించిన షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయని వివరించింది. 

చంద్రబాబు నవంబరు 29 నుంచి రాజకీయ సభలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. అయితే ఈ నెల 30న చంద్రబాబు విజయవాడలో ఏసీబీ కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. తన చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది.