ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీల వారు వచ్చి ఇది చేస్తాం… అది చేస్తామంటూ మాటలు చెప్పి వెళతారని, అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్‌ది పేగు బంధమని, కాంగ్రెస్‌ది అధికారం కోసం అహంకారమన్నారు. కాంగ్రెస్‌కు పెట్టే గుణం లేదని, అధికారకాంక్ష మాత్రమే ఉందన్నారు. పచ్చబడ్డ తెలంగాణ ఆగం కావొద్దంటే ప్రజలు మరోసారి బీఆర్ఎస్‌ను గెలిపించాలన్నారు. కాంగ్రెస్‌కు ఆరు దశాబ్దాలు అవకాశం ఇస్తే ఏం చేశారని నిలదీశారు. అధికారం శాశ్వతం కాదని, అనుబంధం శాశ్వతంగా ఉంటుందన్నారు.

తెలంగాణ కోసం బీఆర్ఎస్ తీవ్రంగా ఉద్యమించిందని, రాష్ట్రం కోసం కొట్లాడిన పార్టీ అని, అందుకే ప్రజలతో బీఆర్ఎస్‌కు పేగుబంధం ఉందన్నారు. గత పదేళ్ల కాలంలో కేసీఆర్ పాలనలో తెలంగాణ పచ్చబడిందన్నారు. కేసీఆర్ చెప్పింది చేసే వ్యక్తి అన్నారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని పనులు కూడా చేశారన్నారు. రాష్ట్రంలో హనుమంతుడి గుడి లేని ఊరు లేదని, అలాగే కేసీఆర్ పథకం అందని ఇల్లు లేదన్నారు. రాష్ట్రంలో మరోసారి కేసీఆర్ ప్రభుత్వం వస్తే పెన్షన్ రూ.5 వేలకు పెరుగుతుందన్నారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే రూ.3 వేలకు పెరుగుతుందన్నారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం పెరుగుతూ అయిదేళ్లలో రూ.5 వేలకు చేరుతుందన్నారు.